కోల్కతా, జూన్ 8: బెంగాల్ సీఎం మమత మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆయన భార్యకు ఈడీ అధికారులు నోటీసులిచ్చి రప్పించారు.
విదేశీ బ్యాంకుల్లోని ఖాతాల గురించి ఆమెను ప్రశ్నించి స్టేట్మెంట్ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. కాగా, రుజిరాను ఈడీ అధికారులు ప్రశ్నించడంపై వ్యాఖ్యానించడానికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించారు. దీనిపై ఏమైనా మాట్లాడాలనుకుంటే రుజిరాయే చెబుతుందని ఆమె పేర్కొన్నారు. కాగా రోజురోజుకు తమ కుటుంబానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను తట్టుకోలేకే బీజేపీ ఈ దాడులు చేయిస్తున్నదని అభిషేక్ బెనర్జీ ఆరోపించారు.