జోధ్పూర్, నవంబర్ 5: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈడీ డబ్బును పంపిణీ చేస్తున్నదని ఆరోపించారు. అయితే తాను చేసిన ఆరోపణకు సంబంధించిన వివరాలను ఆయన పూర్తిగా వివరించలేదు. ‘దేశంలో ఎన్నికలు, ఈడీ దాడులు ఏకకాలంలో జరగడం ఇదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో ఈడీ డబ్బు పంచుతున్నది. ఈ విషయంలో ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలి’ అని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి దేశంలో ఆర్థిక నేరాలు, ఎగవేతలకు పాల్పడే వారి పనిపట్టడం ఈడీ, ఐటీ శాఖల పనికాగా, అది మరచి అవి దేశంలోని రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.