ED | న్యూఢిల్లీ, మార్చి 25: మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈడీ కస్టడీ నుంచే పాలనపరమైన ఆదేశాలు జారీచేయడంపై ఈడీ దృష్టిసారించింది. కేజ్రీవాల్కు తాము కంప్యూటర్ కానీ, పేపర్ కానీ ఇవ్వలేదని, అలాంటప్పుడు ఆయన ఎలా ఆదేశాలు జారీ చేశారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నది. సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నుంచే ఆదేశాలు జారీచేశారంటూ ఢిల్లీ మంత్రి ఆతిశీ విలేకరుల సమావేశంలో ఓ నోట్ను చదివి వినిపించిన సంగతి తెలిసిందే. రాజధానిలో నీటి సమస్య పరిష్కారానికి కేజ్రీవాల్ సూచనలు చేశారని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆ నోట్ ఎలా వచ్చిందో మంత్రి ఆతిశీని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం. కాగా, కేజ్రీవాల్ను ఈ నెల 28వరకు ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించిన విషయం తెలిసిందే.
కేజ్రీవాల్కు సంఘీభావం కూడగట్టేందుకు ఆప్ సోషల్ మీడియాను వేదికగా ఎంచుకున్నది. కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ నేతలు, కార్యకర్తలు సోమవారం తమ ప్రొఫైల్ చిత్రాలను మార్చారు. కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్ చిత్రాన్ని డిస్ప్లేలో పోస్ట్ చేశారు. మోదీ కా సబ్సే బడా దార్ కేజ్రీవాల్ (మోదీని అత్యంత భయపెట్టిన కేజ్రీవాల్) అనే శీర్షికను డిస్ప్లే కింద పోస్ట్ చేశారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మద్దతునివ్వాలని కోరుతూ ఆప్ ఈ క్యాంపెయిన్ ప్రారంభించింది.