పట్నా : డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం రాకుంటే నిరుద్యోగిగా మారడం లేదా ప్రభుత్వాన్ని నిందిస్తూ కాలయాపన చేస్తుండే వారిని చూస్తుంటాం. జాబ్ కోసం వేచిచూడకుండా ఎకనమిక్స్ గ్రాడ్యుయేట్ 24 ఏండ్ల ప్రియాంక తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు అందరూ ప్రశంసిస్తున్నారు. ఎకనమిక్స్లో డిగ్రీ పొందిన ప్రియాంక సరైన ఉద్యోగం కోసం ప్రయత్నించినా జాబ్ దొరకలేదు. సర్కారీ కొలువు ప్రయత్నాలూ విఫలమవడంతో ఆమె తన కాళ్లపై తాను నిలబడాలనే సంకల్పంతో ముందడుగు వేసింది.
యూపీలోని వారణాసికి చెందిన ప్రియాంక పోటీ పరీక్షల్లోనూ శ్రమకోర్చినా ఫలితం లేకపోయింది. దీంతో సామాజిక అడ్డంకులను అధిగమించి తానే సొంతంగా వ్యాపారం చేసేందుకు ముందుకొచ్చింది. పట్నాలోని మహిళా కళాశాల వెలుపల టీ స్టాల్ ఏర్పాటు చేసింది. ఉద్యోగం రాలేదని తాను ఆందోళన చేపడితే తన సమయం, శక్తియుక్తులూ వృధా అవుతాయని స్వయంశక్తిని నమ్ముకుని వినూత్న మార్గంలో విజయం కోసం టీ అమ్మాలని నిర్ణయించుకున్నానని ప్రియాంక చెబుతోంది.
ఎంబీఏ ఛాయ్వాలా ప్రఫుల్ బిలోర్ స్ఫూర్తితో తాను ఈ షాపును ప్రారంభించానని చెప్పుకొచ్చింది. చిన్నగా ప్రారంభించిన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపి భారీ స్ధాయికి తీసుకుపోవడమే తన లక్ష్యమని తెలిపింది. చదువుకుంటానని చెప్పి తాను పట్నాకు వచ్చానని, ఇక్కడ టీ షాప్ ఓపెన్ చేసిన విషయం ఇటీవలే తల్లితండ్రులకు చెప్పానని ప్రియాంక పేర్కొంది. తనకు లభిస్తున్న ఆదరణను చూసి తల్లితండ్రులు కూడా తన నిర్ణయాన్ని ఆమోదించారని వెల్లడించింది.