Economic Survey : కేంద్ర ఆర్థిక మంత్రి (Union Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) గురువారం పార్లమెంట్లో ఆర్థికసర్వే (Economic Survey – 2025-26) ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) జీడీపీ వృద్ధిరేటు 6.8-7.2 గా అంచనా వేస్తూ.. గత ఏడాది కంటే ద్రవ్యోల్బణం (Inflation) పెరిగే అవకాశం ఉందని తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థ FY27లో సుమారు 6.8–7.2% వరకు పెరగనున్నట్లు ఆర్థిక సర్వేలో అంచనా వేశారు. దృఢమైన మాక్రో ఫండమెంటల్స్, సంస్కరణలు ఈ వృద్ధికి బలం ఇస్తున్నాయని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం మొత్తం మీద స్థిరంగా ఉండవచ్చునని, ముఖ్యంగా ఆహారం, ఇంధన ధరలు కంట్రోల్లోనే ఉంటాయని ఆర్థిక సర్వే అంచనా వేసింది. రాజకోశ లోటు తగ్గే దిశగా ఉందని, ఆర్థిక పరిమితికి కట్టుబడి ఉందని పేర్కొంది. తయారీ, సేవల రంగం, గిగ్ ఎకానమీ విభాగాల్లో ఉద్యోగ సృష్టి మెరుగుపడినట్లు సర్వే సూచిస్తున్నది.
భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిందని, దీనివల్ల ఎగుమతులు, పోటీతత్వం పెరగనున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘మేక్ ఇన్ ఇండియా 2.0’ పై దృష్టి కేంద్రీకరించి.. ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు అందిస్తున్నట్లు తెలిపారు.
డిజిటల్ పేమెంట్లు, ఫిన్టెక్, AI వినియోగం వేగంగా పెరుగుతూ.. భారత్ను ప్రపంచస్థాయి టెక్ హబ్గా మలుస్తున్నాయని అన్నారు. సౌర, వాయు, హైడ్రజన్ వంటి గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించి.. స్థిరమైన వృద్ధికి అనుకూలంగా మద్దతు కొనసాగుతోందని చెప్పారు. కాగా ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.