న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇటీవల తగ్గినట్టే తగ్గిన పాజిటివ్ కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆరంభంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఉప ఎన్నికలు జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) వివిధ పార్టీల అభిప్రాయాలు కోరింది. ఈ మేరకు ఇవాళ అన్ని పార్టీలకు లేఖలు రాసింది.
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి చర్యలు చేపట్టాలి..? అనే విషయంలో అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఈసీ తన లేఖల్లో కోరింది. ఆగస్టు 30వ తేదీలోపు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని పేర్కొన్నది. కొన్ని నెలల క్రితం జరిగిన ఎన్నికల నిర్వహణపై తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి మరిన్ని జాగ్రత్తలతో ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఈసీ భావిస్తున్నది. అందులో భాగంగానే పార్టీల నుంచి అభిప్రాయాల సేకరణ చేపట్టింది.