న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం మార్పు చేసింది. తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 27కు బదులు ఫిబ్రవరి 28న జరుగుతుందని తెలిపింది. అలాగే రెండో దశ పోలింగ్ మార్చి 3కు బదులుగా మార్చి 5న జరుగుతుందని చెప్పింది. ఈ మేరకు సవరించిన పోలింగ్ షెడ్యూల్ను గురువారం ప్రకటించింది.
కాగా, 60 మంది సభ్యులున్న మణిపూర్ శాసన సభా కాలం ఈ ఏడాది మార్చి 9తో ముగియనున్నది. దీంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాతోపాటు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
అయితే మణిపూర్ ప్రజలు ఎక్కువగా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంటారు. ఫిబ్రవరి 27 ఆదివారం కావడంతో ప్రార్థనలకు ఇది ఇబ్బందిగా ఉంటుందని పలు గిరిజన సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. దీంతో తొలి దశ పోలింగ్ తేదీని మార్చాలని ఈసీని కోరాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ తేదీలను ఈసీ సవరించింది.
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ పోలింగ్ తేదీని కూడా ఈసీ సవరించింది. ఆ రాష్ట్రంలోని పలు పార్టీలు, సిక్కు సంఘాల విన్నపం మేరకు ఒకే దశలో జరుగనున్న పోలింగ్ తేదీని ఫిబ్రవరి 14 నుంచి 20కి మార్చింది. అదే మాదిరిగా రెండు దశల్లో జరుగనున్న మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీలను తాజాగా సవరించింది.
Election Commission revises Assembly poll dates for Manipur
Voting for the first phase of elections to take place on Feb 28 instead of Feb 27
Second phase of voting to happen on March 5 instead of March 3 pic.twitter.com/igACD2GoLo
— ANI (@ANI) February 10, 2022