న్యూఢిల్లీ: నేర చరిత్ర ఉన్న అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దించే పార్టీలు దానికి గల కారణాలను తప్పక చెప్పాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గతంలో లేదా ప్రస్తుతం నేరస్తులుగా ఉన్న వారికి టికెట్లు ఇచ్చే పార్టీలు, అభ్యర్థులుగా వారిని ఎంపిక చేయడానికి గల కారణాలను మాధ్యమాల ద్వారా తెలియజేయాలని పేర్కొంది. మరింత పారదర్శకంగా ఎన్నికలు జరగాలన్న ఉద్దేశంతో ఈ నిబంధన తీసుకువచ్చినట్లు తెలిపింది.
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల అసెంబ్లీ షెడ్యూల్ను ఈసీ శనివారం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఎన్నికల నియమ, నిబంధనలను మీడియాకు తెలియజేశారు. ఎన్నికల్లో ఓటర్లు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ అభ్యర్థిని తెలుసుకోండి అన్న సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని చెప్పారు.
కాగా, ఎన్నికలలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడానికి రాజకీయ పార్టీలు తమ వెబ్సైట్లు, సోషల్ మీడియా, వార్తాపత్రికలలో నేర నేపథ్యం ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రచురించాలని సుప్రీంకోర్టు గత ఏడాది సూచించింది. ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థి సామర్థ్యం, ఆ అభ్యర్థిని నిలబెట్టడానికి కారణం కాకూడదని ఒక తీర్పులో పేర్కొంది. దీనికి అనుగుణంగా ‘నేరస్తులైన’ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టడానికి గల కారణాలను తెలియజేయాలని రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.