ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో ఎలక్షన్ ఫీవర్ మరింత పెరిగింది. ప్రజలను ఆకర్షించేందుకు ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో పార్టీలు అస్త్రశస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈనెల 15 వరకు ర్యాలీలు, రోడ్షోలు, పాదయాత్రలను నిషేధించింది. దీంతో ప్రజలకు చేరువయ్యేందుకు యూపీలో పార్టీలు ప్రత్యామ్నాయ ప్రచార మార్గాలపై దృష్టి పెట్టాయి. వర్చువల్ ర్యాలీల కోసం కసరత్తు మొదలుపెట్టాయి. ఏ పార్టీ ఏ మాధ్యమాన్ని వినియోగిస్తున్నదంటే..
బీజేపీ 3డీ స్టూడియో మిక్స్
వర్చువల్ ప్రచారం కోసం బీజేపీ ‘3డీ స్టూడియో మిక్స్’ టెక్నాలజీని వినియోగించనున్నట్టు తెలుస్తున్నది. దీని ద్వారా నేతలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒకే వేదికపై ఉన్నట్టు చూపిస్తుంది. బీజేపీ ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో బూత్ స్థాయిలో 1.5 లక్షల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసింది. స్థానిక స్థాయిలో ప్రచారానికి వార్రూమ్లు ఉన్నాయి.
ఎస్పీ వార్రూమ్
డిజిటల్ ప్రచారంపై ఎస్పీ తన వలంటీర్లకు చాలా కాలంగా శిక్షణ ఇచ్చి వార్రూమ్లను ఏర్పాటు చేసింది. 400 నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తల వాట్సాప్ గ్రూపుల్లో చేరాలని ప్రజలను ఆహ్వానిస్తూ ఎస్పీ ట్విట్టర్లో లింక్ పోస్టు చేసింది. గ్రామ స్థాయి నుంచి పట్టణం వరకు వర్చువల్ ప్రచారం చేపట్టనున్నది.
కాంగ్రెస్ లైవ్ టెలికాస్ట్
15 రోజుల పాటు ర్యాలీలను వాయిదా వేసుకున్న ప్రియాంక, డిజిటల్గా ప్రజలకు చేరువవ్వాలని నిర్ణయించుకున్నారు. శనివారం నుంచి పార్టీ ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా ‘ప్రియాంక కే సాత్ లైవ్’ పేరిట ప్రచారం ప్రారంభించారు.
ఎల్ఈడీ స్క్రీన్లతో బీఎస్పీ
ఇతర పార్టీలతో పోల్చుకుంటే వర్చువల్ ప్రచారంలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ వెనుకబడివున్నది. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో ట్రక్కులు, ఆటోలపై ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి డిజిటల్ ప్రచారాన్ని పెంచాలని బీఎస్పీ యోచిస్తున్నది. ఆ పార్టీ సీనియర్ నేత సతీశ్ చంద్ర మాత్రమే ఫేస్బుక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు.
వర్చువల్ ర్యాలీలతో ఆప్
కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ఆద్మీ పార్టీ కూడా డిజిటల్ ప్రచారం నిర్వహిస్తున్నది. ఈనెల 8న వారణాసిలో ఏర్పాటు చేసిన వర్చువల్ ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడారు.
‘సోషల్ ఇంజినీర్ల’ వ్యూహాలు
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు యూ పీలో సోషల్ ఇంజినీరింగ్ పనిని బీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు అప్పగించింది. ఎస్పీని ఈసారి గెలిపించేందుకు ఆ పార్టీ అధినేత అఖిలేశ్.. యాదవేతర కులాల్లో బలంగా ఉండే పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నారు. కాంగ్రెస్కు ప్రియాంక గాంధీ, ఆమె టీం పనిచేస్తుండగా, బీఎస్పీ నుంచి సతీశ్ చంద్ర మిశ్రా ఆ బాధ్యత తీసుకున్నారు.