న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశంలో మరో దఫా ఉప ఎన్నికల పోరుకు నగారా మోగింది. డిసెంబర్ 5న ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ లోక్సభ స్థానంతో పాటు పలు రాష్ర్టాల్లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
మైన్పురీ ఎంపీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించడంతో ఆ స్థానానికి బైపోల్ అనివార్యమైంది. ఇంకా ఉపఎన్నికలు జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాలో యూపీ-రామ్పూర్, రాజస్థాన్-సర్దార్షహర్, ఒడిశా-పదమ్పూర్, బీహార్-కుర్హానీ, ఛత్తీస్గఢ్-భానుప్రతాప్పూర్ ఉన్నాయి. రామ్పూర్ ఎమ్మెల్యేగా ఉన్న అజంఖాన్కు ఓ కేసులో మూడేండ్ల జైలుశిక్ష పడటంతో స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారు. డిసెంబర్ 8న గుజరాత్, హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్తో పాటు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా ఉంటుందని ఈసీ పేర్కొన్నది.