ఓటింగ్ సమయం దగ్గరపడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోపాదయాత్రలు, ర్యాలీలకు అనుమతినిస్తూ శనివారం నిర్ణయం తీసుకుంది. అయితే కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, తక్కువ సంఖ్యతో వీటిని నిర్వహించుకోవాలని సూచించింది. ఆయా రాష్ట్రాల్లో వున్న విపత్తు నిర్వహణ అథారిటీ సూచించిన నియమాలను మాత్రం పాటించాలని నిబంధన విధించింది. దేశ వ్యాప్తంగా కోవిడ్ పరస్థితి, ముఖ్యంగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితిపై కేంద్ర ఎన్నికల సంఘం శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గి, పరిస్థితి కాస్త మెరుగుపడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈసీ పైన పేర్కొన్న నిర్ణయాన్ని తీసుకుంది.
‘ఇచ్చిన నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ… ఆయా పార్టీలు, పార్టీల అభ్యర్థులు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ క్యాంపెయిన్ చేసుకోవచ్చు. విపత్తు నిర్వహణ సంస్థ సూచించిన స్థలంలో గాని ,లేదా ఓపెన్ గా ఉండే స్థలంలో గానీ 50 శాత కెపాసిటీతో ప్రచారం చేసుకోవచ్చు. ఆ సంస్థ విధించిన నియమ నిబంధనల ప్రకారం పాదయాత్ర కూడా చేసుకోవచ్చు’ అని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. కోవిడ్ కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారంపై ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే.