Ebola outbreak : ప్రాణాంతక ఎబోలా వైరస్ (Ebola outbreak) తో ఆఫ్రికా ఖండంలోని రిపబ్లిక్ ఆఫ్ కాంగో (Republic of Congo) లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ (Global Health Emergency) ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా.. కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది.
1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందిందని డబ్ల్యూహెచ్వో వెల్లడించింది. ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొన్నది. ఈ వైరస్కు ప్రత్యేకంగా అమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్లు లేకపోవడంవల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని ఆదేశించింది.
సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవద్దని పేర్కొన్నది. వ్యాధి నిర్ధరణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి.. వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచనచేసింది.