Maharashtra : సభ్యసమాజం తలదించుకునే సంఘటన మహారాష్ట్రలో ఇటీవల జరిగింది. వెలివేసిన ఒక కుటుంబం గుడిలోకి వెళ్లినందుకు ఆ ఇంటి మహిళను అంతా కలిసి అర్ధనగ్నంగా ఊరేగించారు. ఆమె మెడలో చెప్పుల దండ వేసి మరీ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఇటీవల మహారాష్ట్రలోని ఉల్హాసన్ నగర్లోని, వాఘ్రి నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఒక రాజ్పుత్ కుటుంబాన్ని కొంతకాలం క్రితం వారి సామాజిక వర్గానికి చెందిన వారు బహిష్కరించారు.
కుల పంచాయితీలో వారిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గుడిలోకి ప్రవేశాన్ని నిషేధించారు. అయితే, ఇటీవల స్థానికంగా ఒక గుడిలో ఆ సామాజిక వర్గం వారంతా ఒక వేడుక నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆ కుటుంబానికి చెందిన ఒక యువకుడు హాజరయ్యాడు. దీంతో అక్కడున్న వారంతా కోపోద్రిక్తులయ్యారు. అతడిపై దాడి చేశారు. అంతేకాదు.. వారంతా కలిసి అతడి ఇంటిపైకి కర్రలు, రాడ్లతో దాడికి వెళ్లారు. ఇంట్లోని మగవారిపై దాడి చేసిన అనంతరం, ఇంట్లోని మహిళలపై దాడి చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదు ప్రకారం.. నిందితులు ఇంట్లోని మహిళను రోడ్డుపైకి లాక్కొచ్చి, దుస్తులు లాగేశారు. అర్ధనగ్నంగా చేసి ఈడ్చుకెళ్లారు. అలాగే, మెడలో చెప్పుల దండ వేసి దాదాపు రెండు కిలోమీటర్లు ఊరేగించారు.
ఇంకొందరు తమ కాళ్లపై పడి మొక్కాల్సిందిగా బలవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ దారుణ ఘటన జరుగుతుండగా, చుట్టుపక్కల వాళ్లు ఆపడానికి ప్రయత్నించకుండా నిలబడి చూస్తూ ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరిగ్గా స్పందించలేదని, చాలా గంటల తర్వాత గానీ కేసు నమోదు చేయలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మహిళల్ని అరెస్టు చేశారు. మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.