న్యూఢిల్లీ, జనవరి 4: మీరు ఎంత బిజీగా ఉన్నా ఇక నుంచి ఉదయం 8 గంటలకు టిఫిన్, రాత్రి 8 గంటలకు డిన్నర్ చేయాలని ఫిక్స్ అయిపోండి! లేకపోతే గుండె జబ్బుల బారినపడే ప్రమాదం ఉన్నది! భోజన వేళలు, గుండె జబ్బులకు మధ్య ఉన్న సంబంధాన్ని ఫ్రాన్స్లోని సర్బొన్నె పారిస్ నార్డ్ యూనివర్సిటీ అధ్యయనం వివరించింది. ఈ అధ్యయనంలో ఇండియా గురించి నిర్దిష్టంగా ప్రస్తావించారు. ప్రతి లక్ష జనాభాకు ప్రపంచ సగటు గుండె జబ్బు మరణాలు 235 కాగా, ఈ సంఖ్య భారత్లో 272గా ఉంది.
నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం రోజులో మొదటి, చివరి భోజనం త్వరగా తినడంతో పాటు రాత్రిపూట ఎక్కువ సేపు ఉపవాసం ఉండటం గుండె జబ్బుల బారినపడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. టిఫిన్ చేయడం ఒక గంట ఆలస్యం చేస్తే గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం 6 శాతం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. అలాగే రాత్రి 9 గంటల తర్వాత భోజనం చేసేవారిలో ఈ ప్రమాదం 28 శాతం పెరిగింది.