బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల (Karnataka Elections) కోలాహలం తుది ఘట్టానికి చేరుకుంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరు సిటీలోని కొన్ని హోటళ్లు నగర ఓటర్ల కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించాయి. బుధవారం ఓటు వేసేందుకు బయటకు వచ్చే ఓటర్లకు ఉచితంగా ఆహారం అందిస్తామని పేర్కొన్నాయి.
అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎన్నికల సంఘం (Election Commission) ఆయా హోటళ్ల యజమానులకు వార్నింగ్ ఇచ్చింది. ఓటర్లకు ఉచితంగా లేదా రాయితీపై ఆహారం, పానీయాలు ఆఫర్ చేయడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఏ హోటల్లోనైనా అలాంటివి ఆఫర్ చేస్తే హోటల్ యజమానిని అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, అవసరమైతే జైల్లో కూడా పెట్టే ఛాన్స్ ఉందని ఈసీ హెచ్చరించింది.