Earthquake | రెండు రాష్ట్రాలను భూకంపాలు వణికించాయి. హిమాచల్ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లో శనివారం మధ్యాహ్నం భూకంపాలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 1.16 గంటల సమయంలో హిమాచల్ప్రదేశ్ చంబాలో రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. భూమికి తొమ్మిది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఇండ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
అలాగే, మధ్యాహ్నం 1.55 గంటల సమయంలో జమ్మూ కశ్మీర్లోని కిష్టావర్లోనూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో ప్రకంపనలు రాగా.. భూమికి 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఎన్సీఎస్ తెలిపింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆప్ఘనిస్థాన్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రకంపనల ధాటికి దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. భూకంపాలకు ప్రధాన కారణం భూమిలోపల ప్లేట్లు ఢీకొట్టడమే కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు పట్టున్నారు. భూమిలోపల ఏడు పలకలు నిరంతరం కదులుతూ ఉంటాయి. ఈ ప్లేట్లు ఏదో ఒక ప్రదేశంలో ఢీకొట్టుకుంటాయి.
అక్కడ ఫాల్ట్లైన్ జోన్ ఏర్పడుతుంది. అక్కడ ఒత్తిడి పెరిగి.. ప్లేట్స్ విరిగిపోతాయి. దాంతో ఏర్పడిన శక్తి బయటకు వచ్చేందుకు మార్గం ఏర్పరచుకుంటుంది. దాంతోనే భూకి కంపిస్తుంది. దీన్నే భూకంపంగా పిలుస్తామని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రిక్టర్ స్కేల్పై 8వేల భూకంపాలు రిక్టర్ స్కేల్పై 2 తీవ్రతతో వస్తుంటాయని నిపుణులు పేర్కొన్నారు. 4.0 నుంచి 4.9 తీవ్రతతో వచ్చే భూ ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 6200 వరకు వస్తుంటాయని నిపుణులు పేర్కొన్నారు. వీటితో తక్కువ నష్టం వాటిల్లుతుందన్నారు.