పోర్ట్బ్లెయిర్: వరుస భూకంపాలతో (Earthquake) అండమాన్ నికోబార్ దీవులు (Andaman-Nicobar Islands) వణికిపోతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నుంచి క్రమంతప్పకుండా భూ ప్రకంపణలు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం తెల్లవారుజామున 2.26 గంటల సమయంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం క్యాంప్బెల్ తీరానికి (Campbell Bay) 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 32 కిలోమీటర్ల లోతున ప్రకంపణలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నది. దీనివల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఆదివారం మధ్యాహ్నం నుంచి అండమాన్ దీవుల్లో భూకంపం రావడం ఇది మూడోసారిది. ఆదివారం మధ్యాహ్నం 2.59 గంటలకు మొదటిసారిగా భూమి కంపించిందని, దీని తీవ్రత 4.1గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది. అనంతరం గంటల వ్యవధిలోనే మరోసారి 5.3 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిందని చెప్పింది. 10 కి.మీ లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లుగా వెల్లడించింది. ఈనెల 6న కూడా దీవుల్లో భూకంపం సంభవించింది. గత గురువారం రాత్రి 10.47 గంటలకు 5.3 తీవ్రతతో పోర్ట్ బ్లెయిర్కు 140 కి.మీ దూరంలో భూమి కంపించింది. దీనివల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.