శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో వరుసగా రెండో రోజూ భూకంపం సంభవించింది. కశ్మీర్లోని కత్రాలో (Katra) స్వల్పంగా కంపించింది. గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో భూ ప్రకంపణలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.5గా నమోదయిందని వెల్లడించింది. కత్రాకు 84 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
పహల్గామ్లో బుధవారం ఉదయం 5.43 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 3.2గా నమోదయిందని ఎన్సీఎస్ వెల్లడించింది. పహల్గామ్కు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. జమ్ము డివిజన్లో ఈనెల 5న ఉదయం 9.45 సమయంలో 5.9 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.