న్యూఢిల్లీ, ఆగస్టు 27 : ఈ20 పెట్రోల్ వినియోగంపై మోదీ సర్కార్ ఎన్ని మాటలు చెప్పినప్పటికీ దేశవ్యాప్తంగా వాహనదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ20తో వాహనాల మైలేజ్ పడిపోతున్నదని, ఇంజిన్లు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తిరిగి ఈ10 పెట్రోల్ను తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. వాహనదారుల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ప్రీమియం ధరలో లభించే ఆక్టేన్ 95ను ఈ10 పెట్రోల్గా అందించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
ఎక్స్పీ95, స్పీడ్, పవర్95 వంటి బ్రాండెడ్ ఇంధనాలను ఈ10 ఫార్ములేషన్లో విక్రయించటాన్ని కేంద్రం పరిశీలిస్తున్నదట. ఈ10 పెట్రోల్ ఖరీదైన ప్రీమియం పెట్రోల్గా వస్తుందా? సాధారణ పెట్రోల్గా వస్తుందా? అన్నది ఇంకా స్పష్టత లేదు. దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల వద్ద హై-ఆక్టేన్ వేరియెంట్స్ అమ్మకాలు పెరిగాయని (4 శాతం నుంచి 15 శాతానికి) గణాంకాలు చెబుతున్నాయి. ఈ10 కంటే ఈ20 ఇంధనమే మెరుగైందని, వేగం పుంజుకునే సామర్థ్యం ఈ20కే ఎక్కువని కేంద్ర మంత్రి గడ్గరీ లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. అయితే, పాత వాహనాలకు ఈ10 పెట్రోల్ అనువైనదిగా భావిస్తున్న విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది.