చెన్నై, మే 7: వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. పర్యాటకులు, వ్యాపారులు తమ వివరాలను ‘epass.tnega.org’ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి ఈ-పాస్ పొందవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు 7వ తేదీ నుంచి ఈ-పాస్ తప్పనిసరి అని గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. పర్యాటకులు తమ వివరాలు, వాహనాల నంబరు, వచ్చే రోజు..మొదలైన వివరాలను ఆన్లైన్ ద్వారా వెల్లడించి ఈ-పాస్ పొందాల్సి ఉంటుంది. ఈ విధానం జూన్ 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది.