న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశంలో గత నాలుగు నెలల రుతుపవనాల సీజన్లో ‘సాధారణ వర్షపాతం’ నమోదైందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం పేర్కొన్నది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పనటికీ, దానికి వ్యతిరేకంగా పలు సానుకూల కారణాలతో దేశంలో 820 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైందని తెలిపింది. దీర్ఘకాల సగటు వర్షపాతం(ఎల్పీఏ) 868.6 మిల్లీమీటర్లలో 94-106 మధ్య శాతం వర్షాన్ని సాధారణ వర్షపాతంగా పేర్కొంటారు. తాజా రుతుపవనాల సీజన్లో 94.4 శాతం సాధారణ వర్షపాతం నమోదైందని ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మహోపాత్ర వెల్లడించారు. ఈ ఏడాది జూన్లో 91 శాతం, జూలైలో 113, ఆగస్టులో 64, సెప్టెంబర్లో 113 శాతం వర్షపాతం పడిందని తెలిపారు. మొత్తం 36 వాతావరణ సబ్డివిజన్లకు గానూ మూడింటిలో అధిక వర్షపాతం, 26 సబ్డివిజన్లలో సాధారణం, ఏడింటిలో లోటు వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. లోటు వర్షపాతం నమోదైన సబ్డివిజన్ల ప్రాంతాల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, బీహార్, తూర్పు యూపీ, దక్షిణ కర్ణాటర, కేరళ ఉన్నాయని తెలిపారు. మరోవైపు అక్టోబర్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ గరిష్ఠ ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే ఎక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ పేర్కొన్నది. ఈశాన్య రుతుపవనాలతో తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కేరళ, దక్షిణ మధ్య కర్ణాటకలో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలల్లో సాధారణ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అంచనా వేసింది.