భోపాల్: ఒక వ్యక్తికి సంబంధించిన ఇద్దరు భార్యల మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో భర్త గాయపడ్డాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ సంఘటన జరిగింది. తాహెర్ ఖాన్, అతడి మొదటి భార్య అంజుమ్ మధ్య విడాకుల కేసు పెండింగ్లో ఉంది. అయితే హుమా ఖాన్ అనే మహిళను అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మొదటి భార్య అంజుమ్ ఆదివారం తన కుమారుడు మరికొందరితో కలిసి తాహెర్ ఖాన్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతడు బాత్రూమ్లో స్నానం చేస్తున్నాడు. దీంతో రెండో భార్య హుమా ఖాన్ డోర్ తీసింది. తాహెర్ మొదటి భార్య అంజుమ్, రెండో భార్య మధ్య వాగ్వాదం జరిగింది. ఇది కాస్తా వీరిద్దరి మధ్య గొడవకు దారి తీసింది.
మరోవైపు బాత్రూమ్లో స్నానం చేస్తున్న తాహెర్ ఖాన్ ఈ అరుపులు విని బయటకు వచ్చాడు. ఇంటికి వచ్చిన మొదటి భార్య అంజుమ్తో ఘర్షణకు దిగాడు. ఈ సందర్భంగా గన్తో అతడిపై కాల్పులు జరిగాయి. దీంతో తాహెర్ ఖాన్ గాయపడ్డాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది.
కాగా, మొదటి భార్యతో ఘర్షణ సందర్భంగా తాహెర్ ఖాన్ రెండో భార్య హుమా ఖాన్ కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని చెప్పారు. అయితే తాహెర్ ఖాన్పై కాల్పులు జరిపింది ఎవరో అన్నది తెలియలేదని అన్నారు. అతడి మొదటి భార్య, ఆమెతోపాటు వచ్చిన వారిపై అనుమానం వ్యక్తం చేశారు. తాహెర్ ఆస్తిలో వాటా కోసం కూడా అతడి మొదటి భార్య అంజుమ్ కోర్టును ఆశ్రయించిందని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.