చండీగఢ్: షాపులను మూయించడంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో షాపు యజమాని ఒక వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మణిపూర్లో హింసను నిరసిస్తూ పంజాబ్లోని దళిత, క్రైస్తవ సంఘాలు బుధవారం రాష్ట్రవ్యాప్త బంద్కు (Punjab bandh) పిలుపునిచ్చాయి. చాలా ప్రాంతాల్లో బంద్పై ఒక మాదిరి స్పందన కనిపించింది.
కాగా, మోగా జిల్లాలో కాల్పుల సంఘటన జరుగడం కలకలం రేపింది. కోట్ ఇస్సే ఖాన్లో షాపులను బలవంతంగా మూయించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా మొబైల్ షాపు యజమాని గోరా, నిరసకారుడు బల్వంత్ సింగ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన గోరా తన వద్ద ఉన్న లైసెన్స్ గన్తో బల్వంత్ సింగ్పై కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ అతడి ఛాతిలోకి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన బల్వంత్ సింగ్ను మోగాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో లుధియానాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
మరోవైపు కాల్పుల సంఘటనతో కోట్ ఇస్సే ఖాన్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసకారులు ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్ను బ్లాక్ చేశారు. కాగా, బల్వంత్ సింగ్పై కాల్పులు జరిపిన గోరాపై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం వెతుకుతున్నారు.