భోపాల్ : కరోనా మహమ్మారి అన్నివర్గాల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. మహమ్మారిని నివారణకు విధించిన ఆంక్షలు, నిర్బంధాలు, లాక్డౌన్లు, కర్ఫ్యూ ఎంతో మంది ఉపాధిపై ప్రభావం చూపింది. పేద, మధ్య తరగతి జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి అందరినీ కలవరానికి గురి చేస్తున్నది.
ఇప్పటి వరకు భారత్ కొత్త వేరియంట్ కేసులు 24 నమోదయ్యాయి. కొత్త వేరియంట్తో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని, దీంతో మరోసారి లాక్డౌన్లు విధిస్తారనే ఊహాగానాల మధ్య చిరువ్యాపారులు మరోసారి ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాల్లో ఓ చిరువ్యాపారి ఆత్మహత్యకు యత్నించాడు. మట్గువా పోలీస్స్టేషన్ పరిధిలోని ఖడ్గైకి చెందిన వస్త్ర వ్యాపారి అన్షుల్ తండ్రి వినయ్ శర్మ విషయం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. వస్త్ర వ్యాపారం చేస్తున్న తండ్రీ కొడుకులకు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో చాలా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం కొత్త వేరియంట్తో కేసులు పెరిగితే లాక్డౌన్ విధిస్తారనే వార్తల మధ్య భయాందోళనకు గురయ్యాడు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లో ఉన్న ఎలుకల మందును తిన్నాడు.
ఇదిలా ఉండగా అన్షుల్కు రెండేళ్ల కిందట వివాహమైంది. వారికి రెండు నెలల కుమార్తె ఉన్నది. ప్రస్తుతం వ్యాపారం సక్రమంగా జరుకపోవడంతో కుటుంబ పోషణపై ఆందోళనకు గురవుతున్నారు. కరోనాతో నిరంతనం వస్తున్న నష్టాలను ఎలా భర్తీ చేయడమో తెలియడం లేదని, పరిస్థితి ఇలా కొనసాగితే జీవితాంతం కోలుకునే పరిస్థితి లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.