ముంబై: ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలు భారత్కు వచ్చే డ్రై ఫ్రూట్స్ సరఫరాను దారుణంగా దెబ్బతీశాయి. గత ఆదివారం ఆఫ్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో.. వాళ్లు భారత్ సహా పలు దేశాలకు తాత్కాలికంగా ట్రేడింగ్ను నిలిపేశారు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత్కు డ్రై ఫ్రూట్స్ సరఫరా నిలిచిపోయింది. గత ఏడాది భారత్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ దిగుమతుల్లో అత్యధికంగా 85 శాతం ఆప్ఘనిస్థాన్ నుంచే వచ్చాయి. 2020-21 ఆర్థిక ఏడాదిలో భారత్.. ఆప్ఘనిస్థాన్ నుంచి మొత్తం 550 మిలియన్ డాలర్ల విలువైన డ్రై ఫ్రూట్స్, యాపిల్స్ దిగుమతి చేసుకున్నది.
ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్ మీదుగా, అదేవిధంగా ఇరాన్లోని చాబహార్ మీదుగా భారత్కు డ్రై ఫ్రూట్స్ దిగుమతి అయ్యేవి. ప్రస్తుతం తాలిబన్లు అన్ని దేశాలతో వాణిజ్యాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ నుంచి భారత వ్యాపారులకు మొత్తం 200 ట్రక్కుల డ్రై ఫ్రూట్స్ దిగుమతి కావాల్సి ఉండగా.. వాటిని నిలిపివేశారు. దాంతో వాటికి ఆర్డర్లు ఇచ్చిన వ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు. అంతేగాక ఇంకొన్నాళ్లు సరఫరా ఇలాగే నిలిచిపోతే డ్రై ఫ్రూట్స్ ధరలు బాగా పెరిగే ప్రమదం ఉన్నది.
ప్రస్తుతం తమ దగ్గర 15 రోజులకు సరిపడా నిలువలు మాత్రమే ఉన్నాయని, డ్రై ఫ్రూట్స్ కొరత కారణంగా వాటి ధరలు ఇప్పటికే 40 శాతం వరకు పెరిగాయని, పరిస్థితి ఇంకొన్నాళ్లు ఇలాగే ఉంటే ధరలు మరింత పెరుగుతాయని ముంబైకి చెందిన ఓ డ్రై ఫ్రూట్స్ వ్యాపారి చెప్పారు. కాగా, ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులు చక్కబడి ట్రేడ్ మొదలయ్యే సరికి చాలా సమయం పడుతుందని, అప్పటిదాకా వినియోగదారులు ధరల భారం మోయాల్సిందేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.