లక్నో: ఇటీవల విమానాల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన రెండు వేర్వేరు ఘటనలను మరువకముందే తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. అయితే ఈసారి విమానంలో కాకుండా రైల్లో అలాంటి ఘటన జరిగింది. విమానాల్లో జరిగిన రెండు ఘటనల్లో బాధితులు, నిందితులు ఇద్దరూ ప్రయాణికులుగా కాగా.. తాజా ఘటనలో మాత్రం ప్రయాణికురాలు బాధితురాలు, ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ) నిందితుడు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం అకల్ తక్త్ ఎక్స్ప్రెస్ రైలు అమృత్సర్ నుంచి కోల్కతాకు బయలుదేరింది. అమృత్సర్కు చెందిన రాజేశ్ కుమార్ ఆ రైల్లో తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రికల్లా రైలు ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరానికి చేరుకుంది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో బాగా తాగిన మత్తులో ఉన్న టీటీఈ.. బెర్తుపై నిద్రిస్తున్న రాజేశ్ కుమార్ భార్య తలపై మూత్రం పోశాడు.
దాంతో నిద్రలేచిన బాధితురాలు కేకలు వేయడంతో తోటి ప్రయాణికులంతా లేచివచ్చారు. జరిగిన విషయం తెలిసి తాగిన మైకంలో ఉన్న టీటీఈని బంధించారు. రైలు లక్నోలోని చార్భాగ్ రైల్వేస్టేషన్కు చేరుకోగానే నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని బీహార్కు చెందిన మున్నా కుమార్గా గుర్తించారు. కోర్టులో హాజరుపర్చిన అనంతరం అతడిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు.