భోపాల్: ఆమె ఒక రాజ కుటుంబానికి చెందిన మహిళ. సాధారణ ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన బాధ్యత ఆమెపై ఉన్నది. ఆమె పూర్వికుల గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆమెపైనే ఉన్నది. కానీ ఆమె మాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. ఫూటుగా మద్యం సేవించడమే కాకుండా ఏకంగా ఆలయం గర్భగుడిలోకి చొరబడి హల్చల్ చేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా పట్టణంలోని ఓ ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాణి జితేశ్వరీ దేవి అనే మహిళ పన్నా పట్టణంలోని ఒకప్పటి రాజ కుటుంబానికి చెందిన మహిళ. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఆమె పూటుగా మద్యం తాగి స్థానికంగా ఉన్న ఓ ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించింది. అక్కడ తూలుతూ, తుల్లుతూ పూజలు చేసింది. ఈ ఘటనపై ఆలయ పాలకమండలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2021లో కూడా ఆమె తన అత్తపై దాడిచేసి, ఆమె కణతకు తుపాకీ గురిపెట్టిన కేసులో జైలుకు వెళ్లి వచ్చింది.