ముంబై : ముంబై క్రూజ్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ఖాన్ బెయిల్పై ఉత్కంఠ కొనసాగుతున్నది. బెయిల్ పిటిషన్ విచారణను బాంబే హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. బెయిల్పై విచారణ సందర్భంగా ఆర్యన్ఖాన్కు బెయిల్ ఇవ్వొద్దని ఎన్సీబీ వాదించిన ఎన్సీబీ.. అతనికి బెయిల్ వస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశాలున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. డ్రగ్స్ కేసును షారుఖ్ మేనేజర్.. సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్ కేసుకు సంబంధించి ఆర్యన్ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎన్సీబీ వాదించగా.. ఆర్యన్ తరఫున సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
ఆర్యన్ అమాయకుడని, అసలు ఈ కేసులో అతన్ని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని వాదించారు. క్రూజ్షిప్లో అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, డ్రగ్ టెస్ట్ కూడా నిర్వహించలేదన్నారు. ఆర్యన్ ఖాన్ ఫోన్లోని చాట్ 2018లో జరిపినవిగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. రేపు బెయిల్కు బెయిల్ వస్తుందా? లేదా? తేలనుంది. డ్రగ్స్ కేసులో ఈ నెల 3న అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్షా తనయుడు.. అప్పటి నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నాడు. ఇప్పటికే రెండుసార్లు కోర్టు బెయిల్ పిటిషన్ను తిరస్కరించిన విషయం తెలిసిందే.