న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయాల్లో ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు (Drugs Case) కూడా ఒకటి. ఈ కేసులో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు కూడా అరెస్టవడంతో దీనిపై ఫోకస్ పెరిగింది. ఈ క్రమంలో డ్రగ్స్ వాడకంపై సీనియర్ లాయర్, రాజ్యసభ ఎంపీ కేటీఎస్ తుల్సి స్పందించారు.
సమతుల మోతాదుల్లో డ్రగ్స్ వాడకాన్ని ప్రభుత్వం అనుమతించాలని ఆయన చెప్పారు. మద్యం, గుట్కా, పొగాకు వాడకానికి ఎలా అనుమతులిచ్చారో అలాగే పన్ను చెల్లించి డ్రగ్స్ కూడా తీసుకునే అవాశం కల్పించాలని సూచించారు.
‘డ్రగ్స్ అనేవి చాలా సందర్భాల్లో మన జీవితాల్లో భాగమవుతాయి. జీవితంలోని బాధలను డ్రగ్స్ తగ్గిస్తాయి. మద్యం, పొగాకు, గుట్కా కూడా మనకు హాని చేస్తాయి. కానీ వీటి వాడకానికి అనుమతి ఉంది. అప్పుడు డ్రగ్స్ను ఎందుకు అనుమతించరు? చాలా సందర్భాల్లో మెడిసిన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు డ్రగ్స్ వాడకానికి ఎందుకు అనుమతించకూడదు?’ అని తుల్సి ప్రశ్నించారు.
1985లో చేసిన నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టానికి సవరణలు అవసరమని, చాలా సందర్భాల్లో కొందరిని ఇబ్బంది పెట్టడానికి ఈ చట్టాన్ని వాడుకున్న దాఖలాలు ఉన్నాయని ఆయన వివరించారు.