Madhya Pradesh | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): డబుల్ ఇంజిన్ సర్కారు పాలనలోని మధ్యప్రదేశ్ విద్యుత్తు సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. కరెంటులేక ఎండిపోతున్న పంటలను చూడలేక రైతన్నల గుండెలు బద్ధలవుతున్నాయి. ఇండ్లల్లో అంధకారంతో సామాన్యులు అహాకారాలు చేస్తున్నారు. కరెంటుకోసం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు శివరాజ్సింగ్ ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. కోతలు లేకుండా కనీసం 14 గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను 24 గంటల్లో మార్చాలని రైతులు ఆందోళన బాట పట్టారు. కరెంటు సంక్షోభంపై బీజేపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. దేవుడిపై భారం వేసి దిక్కులు చూస్తున్నది.
డిమాండ్కు సరిపడా విద్యుత్తు లేకపోవటంతో మధ్యప్రదేశ్లో కరెంటు కోతలు భరించరానిస్థాయికి చేరాయి. రాష్ట్రంలో రోజుకు 22,730 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. కానీ ఇది డిమాండ్కు తగ్గట్టుగా లేదు. దీంతో ఈ నెల మొదటివారం నుంచి వ్యవసాయానికి 7 గంటలే కరెంటు అందిస్తున్నది. కోతలతో పంటలకు నీరందించలేక రైతులు ఆందోళన బాట పట్టారు. ఆర్ఎస్ఎస్ రైతు విభాగమైన భారతీయ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలోనే రైతులు రోడ్డెక్కి నిరసనలు చేపడుతున్నారు. ఖాండ్వా జిల్లా, ముండి తాలూకా, డైట్ గ్రామంలో సుఖ్రామ్ అనే రైతు ఆత్మహత్య చేసుకోవటంతో ప్రభుత్వంపై రైతులు మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. అతివృష్టి, అనావృష్టితో సుఖ్రామ్ రూ.4.5 లక్షల పంట నష్టపోయాడు. పరిహారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగి వేసారి ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో శివరాజ్ ప్రభుత్వంపై రైతన్నలు తిరగబడ్డారు. అగర్-మాల్వాలోని నల్ఖెడ్ బ్లాక్లో విద్యుత్తు కోతలకు నిరసనగా అధికారులను ప్రజలు కార్యాలయంలోనే బంధించారు. పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్లను వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జన్ ఆశీర్వాద్ యాత్రల్లో పాల్గొంటున్న మంత్రులకు ప్రజల నుంచి తీవ్ర నిరస ఎదురవుతున్నది. ఖాండ్వా జిల్లాలోని మాంధాత అసెంబ్లీ నియోజకవర్గంలో జన్ ఆశీర్వాద్ యాత్రలో పాల్గొనడానికి వెళ్లిన మంత్రి తులసీరామ్ సీలావత్ను వందల మంది రైతులు ముట్టడించారు. పంట నష్ట పరిహారంతోపాటు 14 గంటలపాటు విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలోనూ రైతులు జిల్లా కలెక్టర్, , తహసీల్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తున్నారు.
విద్యుత్తు సమస్యను పరిష్కరించలేక సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ చేతులెత్తేశారు. ఈ నెల 4న మహాకాళ్ ఆలయానికి వెళ్లి కరెంటు సమ స్య నుంచి గట్టెక్కించాలని దేవుడికి మొరపెట్టుకొన్నారు. దీంతో ప్రజల్లో అసహనం, అసంతృప్తి మరింత పెరిగిపోతున్నాయి. దశాబ్దన్నరకుపైగా రాష్ర్టాన్ని పాలిస్తున్న వ్యక్తికి విద్యుత్తు సమస్యను పరిష్కరించటం చేతకాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదేనా డబుల్ ఇంజిన్ సర్కారు అంటే అని మండిపడుతున్నారు.
దేశంలో విద్యుత్తు డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి, సరఫరా లేదని కేంద్రం అంగీకరించింది. ఈ వర్షాకాలంలో సరిగ్గా వానలు పడకపోవడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు సరిగా లేవని, దీంతో డిమాండ్కు తగ్గట్టు విద్యుత్తును ఉత్పత్తి చేయలేకపోతున్నామని తెలిపింది. గత సంవత్సరం గరిష్ఠంగా విద్యుత్తు డిమాండ్ 212 గిగావాట్స్ ఉండగా.. ఈ ఏడాది అది ఇప్పటికే 241 గిగావాట్లకు చేరుకున్నదని వెల్లడించింది. జల విద్యుదుత్పత్తి లోటును భర్తీ చేయడానికి ఇతర వనరులను ఉపయోగించుకోవడంపై దృష్టిసారించాలని రాష్ర్టాలను కోరింది. వీలైనంత వరకు విద్యుత్తు డిమాండ్ను అందుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ర్టాలకు లేఖ రాసింది. మరోవైపు దేశంలో నెలకొన్న విద్యుత్తు సంక్షోభానికి ప్రధాన కారణం కేంద్రానికి ముందుచూపు లేకపోవడమేనని పలువురు విమర్శిస్తున్నారు. విద్యుత్తు అనేది నిరంతర ప్రక్రియ అని.. డిమాండ్, సైప్లెను నిరంతరం అంచనా వేస్తూ ముందుకుసాగాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. అయితే కేంద్రం మాత్రం ఎండాకాలంలోనే కరెంటు సమస్యలు ఉంటాయని భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు కనిపిస్తున్నదని, అందుకే ఇప్పుడు విద్యుత్తు సంక్షోభం నెలకొన్నదని విమర్శిస్తున్నారు.