న్యూఢిల్లీ/ హైదరాబాద్, అక్టోబర్12 (నమస్తే తెలంగాణ): ఐటీ చట్టంలోని సెక్షన్ 66(ఏ)ను 2015లోనే రద్దు చేసినందున, ఆ చట్టం కింద దేశంలోని ఏ పౌరుడినీ విచారణ చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం కొన్ని చోట్ల 66(ఏ) కింద కేసులు నమోదవుతున్నాయని, వాటిపై విచారణ కొనసాగుతున్నదని చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సెక్షన్ 66(ఏ) రద్దయిన విషయాన్ని పదే పదే ప్రభుత్వాలకు, ముఖ్యంగా పోలీసులకు చెప్పకర్లేదు.
ఆ సెక్షన్ కింద దేశంలో పౌరుడిపై కేసు నమోదు చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. సదరు సెక్షన్ కింద పౌరులు ఎవరినీ ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదు. ఈ నిబంధన కింద కేసులు పెట్టొద్దని అన్ని రాష్ర్టాల డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పోలీస్ అధికారులు.. కిందిస్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలి’ అని ఆదేశించింది. గతంలో సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేస్తే మూడేండ్ల జైలు, జరిమానా విధించే ఆస్కారం ఉండేది. దాన్ని 2015లో సుప్రీం కోర్టు చట్టం నుంచి తొలగించింది. ఐటీ చట్టం-2008 (సవరణ)లో సెక్షన్ 66ఏను చేర్చారు. అయితే, ఈ నిబంధనను శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2015 మార్చి 24న కోర్టు తొలగించింది.
పిటిషనర్ వాదన ఇది
పిటిషనర్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిక్ వాదిస్తూ, 2015లో రద్దయిన సెక్షన్ 66 (ఏ)ను ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో పోలీసులు అమలు చేస్తున్నారని తెలిపారు. దర్యాప్తులు చేసి, అరెస్టులు చేస్తున్నాయని వెల్లడించారు. ఇష్టానుసారంగా అరెస్టులు చేసేందుకు చెల్లుబాటుకాని ఈ సెక్షన్ను వినియోగిస్తున్నారని వివరించారు. ఇది పౌరహకుల ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నారు.
ఫేస్బుక్ పోస్టింగ్పై కేసులో తొలి తీర్పు
‘సోషల్ మీడియా పోస్టింగ్స్పై ఐటీ చట్టంలోని సెక్షన్ 66 (ఏ) నమోదు చేయడం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించడమే. సోషల్ మీడియాలో అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తే విపత్తు ముంచుకురాదు. వాక్ స్వాతంత్ర ప్రాథమిక హకుకు భంగం కలిగించేలా ఈ సెక్షన్ ఉన్నది’ అని 2015లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. శివసేన అధినేత బాల్ ఠాక్రే మృతి చెందినపుడు ముంబైలో బంద్ పాటించడాన్ని వ్యతిరేకిస్తూ ఒక యువతి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. దీన్ని మరొకరు లైక్ చేశారు. దీంతో ఆ ఇద్దరిపై మహారాష్ట్ర పోలీసులు సెక్షన్ 66 (ఏ) కింద కేసు నమోదు చేశారు. ఇది రాజ్యాంగంలోని 14, 19, 21 అధికరణలకు వ్యతిరేకమని శ్రేయా సింఘాల్ దాఖలు చేసిన పిల్పై విచారణ చేపట్టిన సుప్రీం.. ఆ సెక్షన్ను తొలగించింది.