న్యూఢిల్లీ: ప్రధాని మోదీ (PM Modi) నివాసం వద్ద ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్మార్గ్లో ఉన్న ప్రధాని నివాసంపై సోమవారం తెల్లవారుజామున డ్రోన్ (Drone) సంచరించినట్లు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) గుర్తించింది. దీంతో ఎస్పీజీ అధికారులు ఉదయం 5.30 గంటలకు ఢిల్లీ పోలీసులకు (Delhi Police) సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు డ్రోన్ను గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. అయితే నో ఫ్లయింగ్ (No Fly zone) జోన్లో ఉన్న ప్రధాని నివాసంపై డ్రోన్ను ఎవరు ఎగురవేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రధాని నివాసం (PM residence) సమీపంలో ఏదో గుర్తుతెలియని వస్తువు (Flying object) ఎగిరిందని తమకు సమాచారం అందిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో దానికోసం వెతికామని.. కానీ ఎలాంటి వస్తువూనూ తాము గుర్తించలేదన్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ATC)ని కూడా సంప్రదించామని, వారికి కూడా డ్రోన్ ఎగిరినట్లు ఎలాంటి ఆనవాలు లభించలేదని వెల్లడించారు.