న్యూఢిల్లీ : దాయాది దేశం పాక్ నుంచి భారత భూభాగంలోకి శనివారం అర్ధరాత్రి డ్రోన్ ప్రవేశించింది. పెద్ద ఎత్తున డ్రగ్స్ను జార విడిచింది. సరిహద్దు గ్రామమైన ధనోవాలాలోని పొలంలో ఆదివారం ఉదయం బీఎస్ఎఫ్ సిబ్బంది, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి.. పెద్ద ఎత్తున హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
దీని బరువు మూడున్నర కిలోలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సరిహద్దు భద్రతా దళం శనివారం రాత్రి గరిండా పోలీస్స్టేషన్ పరిధిలోని సరిహద్దుల్లో గస్తీ తిరుగుతుండగా.. అదే సమయంలో సరిహద్దు మానిటరింగ్ పోస్ట్ (BOP) రతన్ ఖుర్ద్ ప్రాంతంలో పాక్ నుంచి డ్రోన్ వస్తున్న విషయాన్ని సైనికులు గుర్తించారు.
వెంటనే స్పందించి దానిపై కాల్పులు జరిపారు. వెంటనే అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం సైనికులు, పంజాబ్ పోలీసుల సంయుక్త బృందం ధనోవాలోని ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా.. నల్లటి ప్లాస్టిక్ టేప్తో చుట్టిన ప్యాక్ను గుర్తించారు.
దాన్ని తెరిచి పరిశీలిచంగా.. మూడు హెరాయిన్ ప్యాకెట్లు ఉన్నాయి. దాని బరువు మూడున్నర కిలోల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. డ్రోన్ హెరాయిన్తో పాటు ఆయుధాలు సైతం పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో కొంత మందిని పోలీసులు విచారించారు.