శ్రీనగర్ : జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి లష్కరే తోయిబా ఉగ్రవాదుల పనేనని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. వైమానిక స్థావరంపై ఆదివారం రెండు సార్లు టెర్రర్ అటాక్ జరిగింది వాస్తవమేనని ఆయన తెలిపారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే రెండు పేలుళ్లు జరిగాయని, మొదటి పేలుడు భవనం పైకప్పుపై జరగ్గా, రెండో పేలుడు ఓపెన్ ఏరియాలో చోటు చేసుకుంది. ఈ పేలుళ్ల కేసును కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్ఐఏ )కు అప్పగించిన విషయం తెలిసిందే. వైమానిక స్థావరంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
జమ్మూకాశ్మీర్లో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి సోమవారం అర్ధరాత్రి కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్ సంచరించినట్లు బలగాలు పేర్కొన్నాయి. అయితే, దీనికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. గత రెండు రోజుల్లో నాలుగుసార్లు డ్రోన్లు సంచరించాయి. ఇందులో రెండింటితో స్వల్ప నష్టం జరిగింది. సోమవారం రత్నుచక్ -కలుచక్ మిలటరీ ప్రాంతంలో కనిపించిన రెండు డ్రోన్లను గమనించిన అప్రత్తమైన దళాలు తరిమివేసినట్లు రక్షణ మంత్రిత్వశాఖ పబ్లిక్ రిలేషన్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ అధికారిక ప్రకటనలో తెలిపారు.