హైదరాబాద్, మార్చి 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో తాగునీటి కటకట మొదలైంది. రాజధాని బెంగళూరు సహా రాష్ట్రంలోని ఏడు వేలకు పైగా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంది. నీటికోసం రోజూ యుద్ధాలు చేసే పరిస్థితి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. ఎండాకాలం రాకముందే ఇలా ఉంటే, రానున్న రోజుల్లో తమ పరిస్థితి ఏమిటని బెంబేలెత్తిపోతున్నారు. వర్షాభావం, కరువు పరిస్థితులను అంచనా వేసి ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని మండిపడుతున్నారు.
ఒకవైపు తాగునీటి కటకటతో అల్లాడిపోతున్న కర్ణాటక ప్రజలకు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మాఫియా చుక్కలు చూపిస్తున్నది. 12 వేల లీటర్ల ట్యాంకర్ ధర గతంలో రూ. 700గా ఉంటే ప్రస్తుతం రూ. 2 వేల వరకూ ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ యజమానులు వసూలు చేస్తున్నట్టు సామాన్యులు, ఐటీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ అన్నింటినీ స్వాధీనం చేసుకోనున్నట్టు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తాజాగా ప్రకటించారు. ప్రైవేట్ బోర్వెల్ నిర్వాహకులు, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ యజమానులు ‘బెంగళూరు వాటర్ సైైప్లె, సీవరేజ్ బోర్డ్’ (బీడబ్ల్యూఎస్ఎస్బీ) వద్ద మార్చి 7లోగా రిజిష్టర్ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలు జారీచేసింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరుచేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరా కోసం ఉపయోగించనున్నట్లు తెలిపారు.
తాగునీటి సంక్షోభం బెంగళూరునూ వెంటాడుతున్నది. నగరంలోని యలహంక, కనకపుర, వైట్ఫీల్డ్ ప్రాంతాల్లో సమస్య మరింత ఎక్కువగా ఉన్నది. దీంతో నీటి వృథాను కట్టడి చేసేందుకు వైట్ఫీల్డ్లోని ఓ హౌసింగ్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. అనవసరంగా నీటిని వృథా చేసే వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నీటి వృథాను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపింది.
తాగునీటి కష్టాలను తప్పించుకోవడానికి అంకోలా జిల్లాలోని శింగన్మక్కీ గ్రామ మహిళలు వినూత్న ఆలోచన చేశారు. ఇండ్ల మధ్యలో గొయ్యిలు తీసి ఇటుకలతో ఏడడుగుల లోతు చిన్న బావిని నిర్మించుకొంటున్నారు. తాగునీరు లభించినప్పుడు ఆ బావిలో నిల్వ ఉంచుకొంటున్నారు. అవసరమైనప్పుడు, ఆ నీటిని శుద్ధిచేసి తాగడానికి, వంటకు వాడుకొంటున్నట్టు మహిళలు పేర్కొన్నారు.
బెంగళూరులో 3 వేలకు పైగా బోరుబావుల్లో నీళ్లు లేకుండా పోయాయి. మా ఇంట్లోని బోరు బావి కూడా ఎండిపోయింది. ఇది ఎంతో క్లిష్టమైన పరిస్థితి. అయినప్పటికీ, ప్రజలకు తక్కువ ధరకే నీటిని సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
– డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం