న్యూఢిల్లీ : డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సోమవారం పెద్ద ఎత్తున బంగారాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. ‘ఆపరేషన్ ఈస్టర్న్ గేట్వే’ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి, బంగారం అక్రమ రవాణా గుట్టు రట్టు చేసింది. బంగ్లాదేశ్ నుంచి భారత్కు భారీగా అక్రమంగా తరలిస్తుండగా.. పశ్చిమ బెంగాల్లో దాదాపు రూ.14కోట్ల విలువైన 24 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బంగారం అక్రమ రవాణాకు గురించి సమాచారం అందుకున్న డీఆర్ఐ ‘ఆపరేషన్ గేట్ వే’ చేపట్టింది.
ఇందులో భాగంగా ఇండో-బంగ్లా సరిహద్దుతో సహా పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల్లో ప్రత్యేకంగా బృందాలతో బంగారం స్మగ్లింగ్ గురించి ఆరా తీసింది. పక్కాగా అందిన సమాచారం మేరకు బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఎనిమిది మందిని గుర్తించారు. ఈ క్రమంలో మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి బంగారం అక్రమంగా రవాణా చేస్తుండగా ఎనిమిదిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని దోల్ఖోలా రైల్వేస్టేషన్ నుంచి అసోంలోని బదర్పూర్ జంక్షన్ మీదుగా సీల్దాకు రైలుతో ప్రయాణిస్తున్న నలుగురిని పట్టుకున్నారు. వారి నుంచి 18.66 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రత్యేకంగా తయారు చేసిన నడుము బెల్టుల్లో బంగారు కడ్డిలను దాచి అక్రమంగా తరలిస్తున్నారు. అలాగే అగర్తలా సమీపంలోని ఇండో-బంగ్లా సరిహద్దు సమీపంలో ఓ వ్యక్తి నుంచి 2.25 కిలోల రెండు బంగారు కడ్డీలు పట్టుకున్నారు. అసోంలోని కరీంగంజ్ వద్ద మరో డీఆర్ఐ బృందం అగర్తల నుంచి సీల్దాకు రైలులో ప్రయాణిస్తుండగా ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.2.03 కోట్ల విలువ చేసే 3.50 కిలోల బరువున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్లో మొత్తం 24.4 బంగారాన్ని స్వాధీనం చేసుకోగా మొత్తం విలువ రూ.14కోట్లు ఉంటుందని, మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు వివరించింది. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు డీఆర్ఐ వర్గాలు తెలిపాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో డీఆర్ఐ ఇప్పటి వరకు దాదాపు వెయ్యి కిలోల వరకు బంగారాన్ని పట్టుకున్నది.