న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా హెరాయిన్ను పట్టుకున్నారు. 62 కిలోల హెరాయిన్ను తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ హెరాయిన్ విలువ రూ.434 కోట్ల విలువ ఉంటుందని డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో కాంప్లెక్స్లో మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఉగాండాలోని ఎంటెబ్బే నుంచి కార్గోలో దుబాయి మీదుగా ఢిల్లీకి హెరాయిన్ చేరినట్లు చెప్పారు. కార్గోలో వచ్చిన 330 ట్రాలీ బ్యాగులు ఉండగా.. 126 ట్రాలీ బ్యాగ్ మెటల్ ట్యూబ్లలో దాచి హెరాయిన్ను రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు డీఆర్ఐ పేర్కొంది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అలాగే పలువురు అనుమానితులను సైతం విచారిస్తున్నట్లు తెలిపింది. గతేడాది డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది.
2021 సంవత్సరంలో 3,300 కిలోలకుపైగా హెరాయిన్ను స్వాధీనం చేసుకోగా.. ఈ ఏడాది జనవరి నుంచి డీఆర్ఐ న్యూఢిల్లీలోని ఐసీడీ తుగ్లక్బాద్లోని ఓ కంటైనర్లో 34 కిలోలు, ముంద్రా పోర్ట్లో ఓ కంటైనర్ నుంచి 201 కిలోలు, 392 కిలోల యార్న్ను స్వాధీనం చేసుకున్నారు. విమానాల ద్వారా తరలిస్తుండగా పలువురి నుంచి 60 కిలోలకుపైగా హెరాయిన్ను డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నది.