Punjab | చండీగఢ్, జూన్ 14: పంజాబ్లో నాలుగు రోజుల క్రితం జరిగిన 8.49 కోట్ల భారీ దోపిడీని పోలీసులు ఛేదించారు. నిందితులు 10 మందిలో ఆరుగురిని అరెస్ట్ చేసి 5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. లుధియానాలోని సీఎంఎస్లో ఈనెల 10 అర్ధరాత్రి సాయుధులైన కొందరు దుండగులు సిబ్బందిని బెదిరించి 8.49 కోట్లతో పరారయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఒక మహిళ, ఆమె భర్త, వారి బంధువు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. బుధవారం కట్టలు కట్టల చోరీ నగదును మీడియా సమావేశంలో ప్రదర్శించిన పోలీస్ కమిషనర్ మన్దీప్ సింగ్ సిద్ధూ కేసు వివరాలను వివరించారు. రాత్రికి రాత్రే ధనవంతులు కావాలన్న ఆశ, ప్రేమ కోణం ఈ దోపిడీకి పురిగొల్పిందని ఆయన చెప్పారు.
బీమా ఉందని భద్రత పట్టించుకోలేదు
ఈ దోపిడీకి ప్రధాన సూత్రధారి మన్దీప్ కౌర్ అనే మహిళ కాగా, ఆమె భర్త, మరో బంధువు కూడా భాగస్వాములు. అలాగే ఈ కేసులో సీఎంఎస్ ఉద్యోగి అయిన మనీందర్ మనీ కూడా మరో ప్రధాన నిందితుడు. ఇతనికి, మన్దీప్ కౌర్కు మధ్య దగ్గర బంధుత్వం ఉంది. త్వరగా ధనవంతులు కావాలన్న అత్యాశ, విదేశాలకు వెళ్లడానికి డబ్బు అవసరం పడటంతో వీరు ఈ దోపిడీకి ప్రణాళిక వేసి విజయవంతంగా అమలు చేశారు. జీపీఎస్, ఇతర సాంకేతిక విధానాలతో దోపిడీ జరిగిన 60 గంటల లోపే కేసును ఛేదించినట్టు కమిషనర్ తెలిపారు.
కాగా, సీఎంఎస్ కంపెనీలో చాలా భద్రతా వైఫల్యాలు ఉన్నాయని, నగదును బీమా చేయడం వల్ల వారు భద్రత గురించి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సంస్థలో ఎంత మొత్తం నగదు ఉంది, ఎంత దోపిడీ జరిగింది అన్న విషయాన్ని కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోవడం చూస్తే వారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్ధమవుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.