న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణు(ఏటీజీఎం)లను విజయవంతంగా పరీక్షించారు. మహారాష్ట్ర అహ్మద్నగర్లోని కేకే రేంజ్లో ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ ద్వారా దీనిని గురువారం టెస్ట్ చేసినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఆర్మీ వర్గాలు తెలిపాయి. లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణులు ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఢీకొట్టాయని అధికారులు పేర్కొన్నారు. రెండు వేర్వేరు పరిధుల్లోని లక్ష్యాలను విజయవంతంగా చేధించాయని వెల్లడించారు. ఈ పరీక్షకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు.
కాగా, బహుళ ప్రయోగ సామర్థ్యంతో అభివృద్ధి చేసిన ఏటీజీఎంలను ప్రస్తుతం అర్జున్ ట్యాంక్ 120 ఎంఎం రైఫిల్ గన్ నుంచి సాంకేతికంగా పరీక్షిస్తున్నారు. గురువారం నాటి ట్రయల్స్లో కనిష్ట స్థాయి నుంచి గరిష్ట పరిధి వరకు లక్ష్యాలను ఢీకొట్టే సామర్థాన్ని ఈ క్షిపణి చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, డీఆర్డీవోతోపాటు ఆర్మీని అభినందించారు. ఏటీజీఎం టెస్ట్ ఫైరింగ్కు సంబంధించిన బృందాలను డీఆర్డీవో చైర్మన్ జీ సతీష్ రెడ్డి కూడా అభినందించారు.
#WATCH | DRDO successfully test fires Laser-Guided ATGMs pic.twitter.com/pVnmg0SYO6
— ANI (@ANI) August 4, 2022