ఒడిశాలోని ఓ మారుమూల గ్రామంలో సంతాల్ గిరిజన తెగలో జన్మించిన ద్రౌపది ముర్ము క్లర్క్గా జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. 1997లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, నేడు దేశ అత్యున్నత పీఠానికి చేరుకున్నారు.
న్యూఢిల్లీ, జూలై 21: భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపొందారు. దేశ అత్యున్నత పీఠంపై కూర్చోనున్న తొలి గిరిజన మహిళగా ఆమె రికార్డుల్లోకి ఎక్కనున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము ఈ నెల 25న రాష్ట్రపతిగా ప్రమాణం స్వీకరించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ పదవీ కాలం జూలై 24న ముగియనున్నది. రాష్ట్రపతి పదవికి సోమవారం ఎన్నికలు నిర్వహించగా, గురువారం ఓట్లు లెక్కించారు. ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండులోనూ ఆమె ముందంజలో నిలిచారు. 1,103 (3,16,715 ఓట్ల విలువ) ఓట్ల మెజార్టీతో ఆమె గెలుపొందినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ముర్ముకు 2,161 ఓట్లు రాగా, వాటి విలువ 5,77,777గా ఉంది. యశ్వంత్ సిన్హాకు 1,058 (2,61,062) ఓట్లు వచ్చాయి. మొత్తం 3,219 ఓట్లు చెల్లుబాటయ్యాయి. మొత్తం ఓట్ల విలువ 8,38,839గా ఉంది. తొలుత ఎంపీ ఓట్లను లెక్కించారు. మొత్తం 748 ఎంపీ ఓట్లు పోలవ్వగా, వాటి మొత్తం విలువ 5,23,600గా ఉంది. వాటిలో ద్రౌపది ముర్ముకు 540 (3,78,000), యశ్వంత్ సిన్హాకు 208 (1,45,600) వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అనంతరం ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. కాగా, తక్కువ వయసు(64)లోనే రాష్ట్రప తిగా ఎన్నికయి రికార్డుల్లోకెక్కారు. విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, శరత్ పవార్, యశ్వంత్ సిన్హా తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతిగా గెలుపొందిన ద్రౌపది ముర్ము నివాసానికి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె అద్భుతమైన రాష్ట్రపతిగా సేవలందిస్తూ దేశ అభివృద్ధిలో పాలుపంచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ద్రౌపది ముర్ముకు గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ఎన్నికల కమిషన్ అధికారులు అందజేశారు. ద్రౌపది ముర్ము గెలుపుతో ఒడిశాలోని ఆమె స్వగ్రామమైన రాయ్రంగాపూర్లో సంబురాలు మిన్నంటాయి.