షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రం మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయా కాంగ్రెస్లో సీనియర్ నాయకురాలు అయిన డాక్టర్ ఎం అంపరీన్ లింగ్డో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు అంపరీన్ రాజీనామా లేఖను పంపించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేయడం కోసం తనకు ఎన్నో అవకాశాలను కల్పించిందని, ఈస్ట్ షిల్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ప్రజల కోసం పనిచేయడం కాంగ్రెస్ పార్టీవల్లే తనకు సాధ్యమైందని రాజీనామా లేఖలో అంపరీన్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి అంతా బాగాలేదని, స్థానిక నేతలు పార్టీని భ్రష్ఠు పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రస్తుతం పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేయడం సాధ్యం కాదని అంపరీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.