చెన్నై: కంటి పరీక్షలు, చికిత్సలతో ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్ (83) మంగళవారం కన్ను మూశారు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. డాక్టర్ బద్రీనాథ్ 1978లో శంకర నేత్రాలయ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. చెన్నై నుంగంబాక్కం కేంద్రంగా ఈ శంకర నేత్రాలయ ద్వారా అనేక బ్రాంచీలతో ఉచితంగా పేదలకు సేవలు అందించారు.
డాక్టర్ బద్రీనాథ్ తన బృందం ద్వారా రోజుకు కనీసం 1,200 మందికి చికిత్సలు, వంద మందికి ఆపరేషన్లు చేసేవారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1983లో పద్మశ్రీ అవార్డుతో, 1999లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అవేగాక బీసీ రాయ్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయనను వరించాయి.
చెన్నై ట్రిప్లికేన్లో 1940 ఫిబ్రవరి 24న బద్రీనాథ్ జన్మించారు. 1962లో మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఆమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1970లో చెన్నై అడయార్లో వాలంటరీ హెల్త్ సర్వీస్ పేరిట సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆయన మృతి నేత్ర వైద్య వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.