ఇంఫాల్, జూన్ 30: మణిపూర్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా నోనీ జిల్లాలో రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతం వద్ద కొండచరియలు విరిగిపడటంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 72 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతుల్లో ఏడుగురు టెరిటోరియల్ ఆర్మీ జవాన్లు. గల్లంతైన వారిలో 43 మంది జవాన్లు కాగా, మిగతా వారు కూలీలు అని అధికారులు వెల్లడించారు. ఇంఫాల్-జిరిబామ్ మధ్య కొత్త రైల్వే లైన్ పనులు జరుగుతున్న తుపుల్ యార్డ్ వద్ధ బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 18 మందిని రక్షించినట్టు సైన్యం తెలిపింది.
నదీ ప్రవాహానికి అడ్డుగా..
ఇజాయ్ నదికి అడ్డుగా ఈ శిథిలాలు పడటంతో ప్రవాహం ఆగిపోయిందని అధికారులు తెలిపారు. వరద నీరు రిజర్వాయర్గా మారిందని, శిథిలాలు పక్కకు జరిగిపోతే లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.