ఈసారి కూడా కైలాస్ మానస సరోవర్ యాత్ర ఉండకపోవచ్చు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఈ యాత్రను రద్దు చేశారు. ఈ సారి కూడా ఈ యాత్ర కాస్త అనిశ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ యాత్రకు సంబంధించిన నోడల్ ఏజెన్సీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి సూచనలు ఇప్పటి వరకూ అందలేదు. మూములుగా అయితే.. ఈ యాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కేంద్ర విదేశాంగ శాఖ కుమాన్ మండల్ వికాస్ నిగమ్ (యాత్రకు సంబంధించిన నోడల్ ఏజెన్సీ), పిటోడాగఢ్ జిల్లా యంత్రాంగంతో ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఈ యాత్ర పై చర్చిస్తుంది. ఈ సారి మాత్రం ఇలాంటి సమావేశం ఇప్పటి వరకైతే జరగలేదు. దేశ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఈ సారికైలాస్ మానస సరోవర్ యాత్ర ఉంటుందని అందరూ భావించారు.
మామూలుగా ఈ యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం జనవరి నుంచి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన సూచనలను కేంద్ర విదేశాంగ శాఖ జారీ చేస్తుంది. కానీ… ఈ యేడాది ఇప్పటి వరకూ ఎలాంటి సూచనలు తమకు రాలేదని నోడల్ ఏజెన్సీ అధికారులు పేర్కొంటున్నారు. ఇక.. యాత్ర కోసం ఏర్పాట్లు చేయడానికి తమ దగ్గర సమయం కూడా అంతగా లేదని నోడల్ ఏజెన్సీ జనరల్ మేనేజర్ ఏపీ వాజ్పాయ్ అన్నారు. ఒకవేళ తమకు ఈ యాత్రకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు అందినా… ఇప్పుడు ఏర్పాట్లు చేయడం చాలా కష్టతరమైన పని అని ఆయన అంటున్నారు.