క్యూ2లో రూ.417 కోట్లుగా నమోదు
న్యూఢిల్లీ, అక్టోబర్ 16: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ లాభాల్లో భారీ వృద్ధి నమోదైంది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల్లో సంస్థ రూ.417.76 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.198.53 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 46.79 శాతం ఎగబాకి రూ.7,788.94 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇది రూ.5,306.20 కోట్లుగా ఉన్నది. ఇదే సమయంలో నిర్వహణ ఖర్చులు 43 శాతం పెరిగి రూ.7,248.74 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. లాక్డౌన్ పరిమితులు ఎత్తివేయడంతో స్టోర్ల ఆదాయం 46 శాతం పెరగడానికి దోహదం చేసినట్లు అవెన్యూ సూపర్మార్ట్ సీఈవో, ఎండీ నీవెల్లి నోరోన్హా తెలిపారు. ప్రస్తుతం సంస్థకు దేశవ్యాప్తంగా 246 స్టోర్లను నిర్వహిస్తున్నది.