కోల్కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలై 24 గంటలైనా గడువకముందే.. అక్కడ రాజకీయ వేడి రగులుతున్నది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే ఉన్నది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్ర బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవానీపూర్లో మమతాబెనర్జిపై అభ్యర్థిని నిలిపి అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దని, అక్కడ ఎన్నిక పూర్తిగా వన్సైడ్ ఉంటుందని ఎద్దేవా చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన మమతాబెనర్జి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, తన పార్టీ అధికారంలోకి రావడంతో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ, రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆమె ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా గెలువాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు ఖాళీస్థానాలున్నా కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వలేదు. గత జూలైలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభ్యర్థన మేరకు ఈ నెల 4న ఈసీ ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. పశ్చిమబెంగాల్లో భవానీపూర్, షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలో పిప్లి అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అక్టోబర్ 3న ఆ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. పశ్చిమబెంగాల్లో భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతాబెనర్జి స్వయంగా బరిలో దిగనున్నారు.