శ్రీనగర్: బయటి వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితాను సవరించి మరింత మంది ఓటర్లను చేర్చుతామన్న జమ్ముకశ్మీర్ చీఫ్ ఎలక్షన్ అధికారి హిర్దేష్ కుమార్ వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. శనివారం జమ్ములోని అబ్దుల్లా నివాసంలో జమ్ముకశ్మీర్కు చెందిన అన్ని పార్టీల సమావేశం జరిగింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ, గుప్కార్ డిక్లరేషన్ ఆఫ్ పీపుల్స్ అలయన్స్ అధికార ప్రతినిధి యూసఫ్ తరిగామి, ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు.
కాగా, అఖిల పక్ష పార్టీల సమావేశం అనంతరం ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. బయట వ్యక్తులకు జమ్ముకశ్మీర్లో ఓటు హక్కు ఉండకూడదని, తామంతా ఇదే కోరుతున్నామని తెలిపారు. బయటి నుంచి వచ్చే పార్టీలను తాము అంగీకరించబోమని చెప్పారు. రోజుకో కొత్త చట్టం తెస్తున్నారని ఆరోపించారు. జేకే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఇచ్చిన హామీలను తాము నమ్మబోమని అన్నారు. ‘ఢిల్లీకి, దిల్కి దూరం తగ్గిస్తానని ప్రధాని కూడా చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏమీ చేయలేదు’ అని అబ్దుల్లా విమర్శించారు.
మరోవైపు రాష్ట్రీయ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఫరూక్ అబ్దుల్లా ఇంటి వద్ద నిరసనకు దిగారు. గుప్కార్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.