ముంబయి, ఆగస్టు 12: రుణాలను వసూలు చేసుకునేందుకు రుణగ్రహీతలపై బెదిరింపులకు పాల్పడరాదని, ఉదయం 8 గంటలకు ముందు, రాత్రి 7 దాటిన తర్వాత కాల్స్ చేసి వేధించరాదని లోన్ రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ మరోసారి స్పష్టంచేసింది. ఈ మేరకు బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఏఆర్సీలకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. రుణ వసూలు విషయంలో రికవరీ ఏజెంట్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఆర్బీఐ పేర్కొన్నది. తమ ఆదేశాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలకు స్పష్టంచేసింది. రుణగ్రహీతలపై రికవరీ ఏజెంట్లు దూషణలకు దిగడం, అభ్యంతరకర సందేశాలు పంపడం, రాత్రివేళల్లో కాల్స్ చేయడం వంటి చర్యలకు దిగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఇప్పటికే వీటి అడ్డకట్టకు ఆదేశాలు జారీచేసింది. అయినప్పటకీ రికవరీ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతుండటంతో శుక్రవారం అదనపు నిబంధనలు జారీచేసింది.