కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తాం, ఉద్యోగులను తొలగిస్తాం.
కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానమిది
అసలు కొత్త ఉద్యోగులనే తీసుకోవద్దు, తీసుకొన్నా సర్కారు పే రోల్ ఇవ్వొద్దు.
బీజేపీ పాలిత గుజరాత్ సర్కారు చెప్తున్నదిది
ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాల భర్తీ. కొనసాగుతున్న 80 వేల పోస్టుల భర్తీ.
– తెలంగాణ సర్కారు పనితీరిది
గాంధీనగర్, అక్టోబర్ 13: ప్రభుత్వ శాఖల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవటానికి వీల్లేదని గుజరాత్ సర్కారు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. అసాధారణ పరిస్థితుల్లోనే, అదీ పరిమితిగానే భర్తీ చేసుకోవాలని స్పష్టం చేసింది. కావాలంటే.. టెక్నాలజీని ఇంకా ఎక్కువగా వినియోగించుకోండి.. కానీ, ఎట్టిపరిస్థితుల్లో కొత్త ఉద్యోగులను నియమించుకోవద్దని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ(ఖర్చుల) కార్యదర్శి మనీశ చంద్ర 18 పేజీలతో కూడిన మార్గదర్శకాలను విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందేనని వెల్లడించారు. క్లాస్-4 ఉద్యోగులకు ప్రభుత్వ పే రోల్ ఇవ్వకూడదని, ఆ స్థాయిలో చేసే పనిని అవుట్సోర్సింగ్కే అప్పగించాలని తెలిపారు. క్లాస్-3, అంతకంటే ఎక్కువ క్యాటగిరీల్లో ఇక నుంచి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమాకాలు చేపట్టకూడదని వెల్లడించారు.
కార్పొరేషన్లు మూసేయాలి
శాఖల పరిధిలోని కార్పొరేషన్లు, బోర్డులపైనా గుజరాత్ సర్కారు కన్నేసింది. వాటిని తొలగించాలని నిర్ణయం తీసుకొన్నది. ‘గత రెండేండ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టని కార్పొరేషన్లు, బోర్డులు ఏవైనా సరే వాటిని మూసేయండి’ అని ఆర్థిక శాఖ కార్యదర్శి ఆదేశించారు.స్వయం ప్రతిపత్తి సంస్థలకు గ్రాంట్ ఆపేయాలి, ఏదైనా శాఖలో వేర్వేరు విభాగాలు ఒకే పని చేస్తుంటే, ఆ రెండు విభాగాలను కలిపేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇక, 10 శాతం నిధులే వినియోగించే కార్యక్రమాలను ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ఆ కార్యక్రమాలను కొనసాగించే శాఖలు కచ్చితంగా వివరణ ఇచ్చి తీరాలని, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఖర్చుల పేరుతో నిరుద్యోగుల మెడకు కత్తి
ప్రభుత్వ శాఖల్లో ఖర్చులను తగ్గించుకోవటానికే ఈ చర్యలు తీసుకొంటున్నట్టు గుజరాత్ సర్కారు పేర్కొన్నది. కానీ, ఈ నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారుతాయని నిపుణులు తెలిపారు. ఉద్యోగాల భర్తీ చేపట్టకపోతే యువత పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మార్గదర్శకాలతో రాష్ట్రంలోని నిరుద్యోగుల ఆశలపై బీజేపీ సర్కారు నీళ్లు చల్లిందని మండిపడుతున్నారు. వెంటనే ఆ మార్గదర్శకాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్లాస్-4 ఉద్యోగులకు ప్రభుత్వ పే రోల్ ఇవ్వొద్దన్న నిర్ణయంపైనా అసహనం వ్యక్తం చేశారు. ఉద్యోగులతో గొడ్డు చాకిరి చేయించుకొని, తగ్గ జీతం ఇవ్వకపోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.