సిమ్లా: గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్ ప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 కొత్త ఏడాది నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలు కొనవద్దని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. ‘గ్రీన్ అండ్ క్లీన్ హిమాచల్’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని అధికారులకు తెలిపారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇంధన వాహనాలను దశల వారీగా ఈ-వాహనాలతో భర్తీ చేయాలని సూచించారు. ఒకవేళ పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల కొనుగోలు అవసరమైన పక్షంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందాలని స్పష్టం చేశారు.
కాగా, హిమాచల్ ప్రదేశ్లో పచ్చదనం కోసం సీఎం సుఖ్విందర్ సింగ్ తొలి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి పలు రాయితీలు ప్రకటించారు. ప్రభుత్వం స్థిర ప్రయత్నాల వల్ల ప్రభుత్వ శాఖల్లోని ఈ-వాహనాల సంఖ్య 185కు చేరినట్లు తెలిపారు. రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ప్రైవేట్ ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 2,733 అని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సులను కూడా దశల వారీగా ఈ బస్సులుగా మారుస్తామని వెల్లడించారు. అలాగే సీఎం సుఖ్విందర్ సింగ్ కూడా గత కొన్ని నెలలుగా ఈ-వాహనాన్ని వినియోగిస్తూ ఆదర్శంగా నిలిచారు.